బ్రసిలియా : ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై బ్రెజిల్ అధ్యక్షుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. చట్టవిరుద్ధమైన ఆన్లైన్ యాప్స్ నుండి నిధులను జప్తు చేసి, వాటిని జాతీయ ప్రజా భద్రతా నిధికి కేటాయించాలని శుక్రవారం అధికారికంగా ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. మాఫియా వ్యతిరేక చట్ట పరిధి కింద ఈ చర్య తీసుకోవడం జరిగింది. రహస్య వేదికల ద్వారా డబ్బు చలామణిని అడ్డుకోవడమే దీని ఉద్దేశ్యం. జప్తు చేసిన నిధులు వ్యవస్థీకృత నేరాల ఆర్థిక వ్యవస్థలకు వ్యతిరేకంగా సాగే పోరాటాన్ని బలోపేతం చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
కాగా, జప్తు చేసిన నిధులను ప్రజా భద్రత కోసం వినియోగించేలా చట్టపరమైన ప్రక్రియ చూస్తుందని అధ్యక్షుడు లూలా సోషల్ మీడియాలో వివరించారు. బ్రెజిల్లోని బెట్టింగ్ యాప్స్లో 41 శాతం నుండి 51శాతం వరకు చట్టవిరుద్ధమైనవి. ఇవి సుమారు 25.2 మిలియన్ల పందెం కాసేవారిని ఆకర్షిస్తున్నాయని న్యాయశాఖ మంత్రి వెల్లింగ్టన్ లిమా తెలిపారు. ఇక ఈ సందర్భంగా ప్రభుత్వం సుమారు 50 వేల యాప్స్ని ఇంటర్నెట్ నుంచి తొలగించింది. అయితే వీటి వెనుక వున్న 300 మంది యాప్ నిర్వాహకుల్ని ప్రభుత్వం గుర్తించిందని ఆర్థిక మంత్రి డ్యూరిగన్ వెల్లడించారు. వీరు అక్రమ పద్ధతిలో 30 సంస్థల ద్వారా నిధులు వినియోగించారని ఆయన అన్నారు. అయితే ఈ యాప్స్ నిలువరించి, ఎంతమేర నిధులను రాబట్టవచ్చనే విషయంపై ప్రభుత్వంకు అంచనా లేదని డ్యూరిగన్ తెలిపారు.









కామెంట్లు (0)