న్యూఢిల్లీ : తమిళనాడు అసెంబ్లీలో మే 13న జరిగిన విశ్వాస పరీక్షలో అవకతవకలు, అవినీతిపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహన్ లతో కూడిన ధర్మాసనం.. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ ఆరోపణలను నిరూపించేందుకు రికార్డులో ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలు లేకుండా, ఇది ``అస్పష్టమైన, అసంబద్ధమైన,సాధారణ ఆరోపణల''పై ఆధారపడి ఉందని ధర్మాసనం పేర్కొంది.
మే 13న డిఎంకె అసెంబ్లీ నుండి వాకౌట్ చేసినప్పటికీ, 25మంది అన్నాడిఎంకె రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ నేతృత్వంలోని టివికె ప్రభుత్వం విశ్వాస ఓటును గెలుచుకుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టివికె విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ .. 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ మార్కును దాటలేకపోయింది. కాంగ్రెస్, విసికె, సిపిఐ, సిపిఐ(ఎం), ఐయుఎంఎల్ మద్దతుతో 120 మంది ఎమ్మెల్యేలను సమీకరించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరిగాయన్న ప్రతిపక్షాల ఆరోపణలను విజయ్ తిరస్కరించారు.









కామెంట్లు (0)