చండీగఢ్ : పంజాబ్లో ప్రత్యేక సమ్రగ సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ జూన్ 25న ప్రారంభం కానుందని, తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిందిత మిత్ర బుధవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి గణన (ఎన్యుమరేషన్) ఫారమ్లను పంపిణీ చేయడం, పూరించడం, సేకరించవంటి వంటివి చేస్తారు. ఈ ప్రక్రియలో 24,453 మంది బిఎల్ఓలు 2.14 కోట్ల మంది ఓటర్లను సంప్రదిస్తారని ఆమె తెలిపారు. ఈ ప్రక్రియలో వచ్చిన అభ్యంతరాలు ఆగస్టు 2 నుండి సెప్టెంబర్ 2 వరకు సమర్పించవచ్చు. వీటిని ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 9లోపు పరిష్కరిస్తారు. తుది జాబితా అక్టోబర్ 1న విడుదల చేస్తామని ఆమె తెలిపారు.
కాగా ఈ సందర్భంగా పంజాబ్లోని 86.02 శాతం మంది ఓటర్ల వివరాలను ఇప్పటికే మ్యాపింగ్ చేసినట్లు సిఇఓ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. మ్యాపింగ్ చేయని ఓటర్ల జాబితాను పార్టీలకు అందజేయడంతో పాటు, వారి వివరాలను మ్యాపింగ్ చేయడంలో ఎన్నికల సిబ్బందికి సహకరించాలని ఆమె పార్టీలను కోరారు. ఈ సమావేశానికి అదనపు సిఇఓ అమన్దీప్ గార్గ్, జాయింట్ సిఇఓ నవనీత్ కౌర్ బాల్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లో కూడా ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ చేపట్టి బిజెపి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బిజెపి నెక్ట్స్ టార్గెట్ పంజాబ్నే అని స్పష్టంగా తెలుస్తోంది.








కామెంట్లు (0)