ముంబయి : సామాన్య ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఆర్థిక ఉత్పత్తులు-సేవలను విక్రయించే మోసపూరిత పద్ధతుల (మిస్సెల్లింగ్)కు అడ్డుకట్ట వేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సోమవారం కఠిన నిబంధనలు జారీ చేసింది. ఈ పథకాల అమ్మకాల కోసం బ్యాంకులు తమ ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చేలా లేదా ఎక్కువ అమ్మకాలను ప్రోత్సహించే ఇన్సెంటివ్ విధానాలపైనా నిషేధం విధించింది. ‘అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ అండ్ సేల్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బై రెగ్యులేటెడ్ ఎంటిటీస్’కు తీసుకొచ్చిన సవరించిన నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల ఉద్యోగులకు థర్డ్ పార్టీ సంస్థలు (బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు) నుంచి నేరుగా ఇన్సెంటివ్లు, రివార్డులు చెల్లించడాన్ని ఆర్బిఐ పూర్తిగా నిషేధించింది.
బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇచ్చే సొంత ప్రోత్సాహకాలను ఆర్బిఐ నిషేధించలేదు. కానీ, ఖాతాదారులను బలవంతపెట్టేలా, తప్పుదోవ పట్టించి ఉత్పత్తులను వారికి అంటగట్టేందుకు ఉద్యోగులను ప్రోత్సహించేలా ఇవి ఉండకూడదని, అమ్మకాల లక్ష్యాల కోసం దూకుడుగా వ్యవహరించేలా ఉండకూడదని స్పష్టం చేసింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, అఫిలియేట్లు, లోన్ సర్వీస్ ప్రొవైడర్లు అందరినీ ఇకపై డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు లేదా డిజిటల్ మార్కెటింగ్ ఏజెంట్ల పరిధిలోకి తీసుకువస్తూ, ఆ నిర్వచనాన్ని ఆర్బిఐ సవరించింది.
థర్డ్ పార్టీ ఏజెంట్లు, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు చేసే తప్పుడు ప్రకటనలు, మార్కెటింగ్ మోసాలకు, ఆ రుణాలు, ఉత్పత్తులు అందించే బ్యాంకులు/ఆర్థిక సంస్థలదే పూర్తి బాధ్యతని ఆర్బిఐ వెల్లడించింది.









కామెంట్లు (0)