ముంబయి : బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ హాయంలో మహారాష్ట్రలో వ్యవసాయరంగం తీవ్రసంక్షోభంలో చిక్కుకుపోయింది. రుణ భారాలతో విలవిల్లాడుతున్న రైతన్నకు ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా అందకపోవడంతో అక్కడి అన్నదాతలు కాడి పడేసి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. 2023లో 6,669 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంతటి దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సిఆర్బి) సమాచారం ఆధారంగా అన్నదాతల బలవన్మరణాల గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ఎన్సిపి ఎమ్మెల్యే ధరంరావు బాబా అత్రం అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ర్ట సహాయ, పునరావాస శాఖ మంత్రి మక్రాండ్ పాటిల్ లిఖిత పూర్వక సమాధానమిస్తూ ..ఈ వివరాలు తెలిపారు. ‘ఆత్మహత్య చేసుకున్నవారిలో 4,150 మంది రైతులు, 2,519 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. అలాగే, వ్యవసాయ కార్మికుల్లో 77 మంది మహిళలు ఉన్నారు’ అని మంత్రి తెలిపారు.
అలాగే, సొంతంగా వ్యవసాయ భూమి లేని 29 మంది వ్యవసాయ కార్మికుల మరణాలను జాబితా నుండి మినహాయించారా? అనే మరో ప్రశ్నకు మంత్రి ‘అది కొంతవరకూ నిజం’ అని సమాధానం ఇవ్వడం గమనార్హాం. మహారాష్ర్టలో అన్నదాతల ఆత్మహత్యల కేసుల సంఖ్యపైనా, అర్హులైన వ్యవసాయ కార్మికులను అధికారిక లెక్కల నుంచి తప్పిస్తున్నారని ఇటీవల ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వివరాలను వెల్లడించింది.







కామెంట్లు (0)