న్యూఢిల్లీ : సిజెపి అధికారిక ఎక్స్ ఖాతా నిలిపివేతపై విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా అభిజిత్ దీప్కేకు ఐటి శాఖ సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి. ఈ సమన్లు ఢిల్లీ పోలీసుల ‘తాజా ఎత్తుగడ’గా ఆవర్గాలు పేర్కొన్నాయి. బుధవారం మధ్యాహ్నం ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) ప్రధాన కార్యాలయంలోని ‘ఎలక్ట్రానిక్స్ నికేతన్’లో విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారని, అయితే నిరసన ప్రాంతమైన జంతర్ మంతర్ నుండి దీప్కేను తరలించేందుకు ఇది ఢిల్లీ పోలీసుల ఎత్తుగడని మండిపడ్డాయి. అయితే జంతర్మంతర్ను వీడేందుకు దీప్కే నిరాకరించారని పేర్కొన్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ శనివారం నుండి దీప్కే జంతర్మంతర్లో నిరనన చేపడుతున్న సంగతి తెలిసిందే. సిజెపి అధికారిక ఖాతా ‘ఎక్స్’ను కేంద్రం మే 21 నిలిపివేసింది. రెండు రోజుల అనంతరం ఈ చర్యను సవాలు చేస్తూ దీప్కే అప్పీల్ దాఖలు చేశారు. అయితే విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ నెల రోజుల అనంతరం సమన్లు జారీ చేయడం గమనార్హం.ఈ విచారణ అంతర్ మంత్రిత్వ శాఖ కమిటీ సమక్షంలో జరగనున్నట్లు పేర్కొన్నాయి. ఐటి చట్టంలోని సెక్షన్ 69ఎ కింద ఎక్స్ ఖాతాపై నిషేధం విధించడంపై స్వతంత్ర జర్నలిస్టులు, మీడియా సంస్థలు సహా పులువురు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆందోళన చేపడుతున్న యువతకు ఇబ్బందులను సృష్టించేందుకు పోలీసులు నీటిసరఫరా నిలిపివేయడం, ఆహారం అందకుండా చేయడం వంటి కుయుక్తులకు పాల్పడుతున్నట్లు దీప్కే వెల్లడించారు. మరుగుదొడ్లకు నీటిసరఫరా నిలిపివేయడం వంటి అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.








కామెంట్లు (0)