న్యూఢిల్లీ : నీట్ ప్రశ్నాపత్రాల లీక్పై ఆందోళన చేస్తున్న యువతను ఉగ్రవాదులని కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను లోక్సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఖండించారు. యువతను అవమానించినందుకు దేశ యువతకు క్షమాపణ చెప్పి.. పదవికి రాజీనామా చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ను రాహుల్ డిమాండ్ చేశారు.
కాగా, అధికార అహంకారంలో మునిగిపోయిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు అధ్వాన్న స్థితికి చేరుకుంది. తమ హక్కులు, న్యాయమైన పరీక్షలు, సురక్షితమైన భవిష్యత్తును మాత్రమే కోరుకుంటున్న విద్యార్థులను విద్యాశాఖ మంత్రి ఉగ్రవాదులు అని సంబోధించారు అని రాహుల్ ఎక్స్ పోస్టులో విమర్శించారు.
అలాగే పదేపదే పరీక్షా పత్రాలు లీక్ కావడం, విద్యా వ్యవస్థలోని వైఫల్యాలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒక్కసారి ఆలోచించండి.. ఎవరి వైఫల్యాల వల్ల అనేకసార్లు పేపర్ లీక్లు జరిగాయి. ఎవరి పాలనలో 20 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన వ్యక్తే... నేడు బాధపడుతున్న పిల్లలను, తమ గళాన్ని వినిపిస్తున్న వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. బిజెపి నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో దేశానికి ఆహారాన్ని సమకూర్చే రైతులను "వృత్తిపరమైన ఆందోళనకారులు, పరాన్నజీవులు" అని పిలిచారు. ప్రశ్నలు అడిగే వారిని ‘దేశద్రోహులు’గా ముద్రవేశారు. ఇక ఇప్పుడు, యువతను ‘ఉగ్రవాదులు’ అని పిలుస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరినైనా వారు దేశద్రోహిగా ముద్ర వేస్తారు. అదే వారి రాజకీయాల సారాంశం అని రాహుల్ పోస్టులో బిజెపి పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
‘నేను గతంలో కోటాలో చెప్పిన మాటనే మళ్లీ చెబుతున్నాను. నేడు ఈ విద్యా వ్యవస్థ కేవలం ఒక దోపిడీ దందాగా మారిపోయింది. దీన్ని ఇలాగే కొనసాగనివ్వను. ప్రతి బిడ్డకూ అందుబాటు ధరలో నాణ్యమైన విద్య, న్యాయమైన పరీక్షలు అందేలా చూడటం నా బాధ్యత. నా గళాన్ని వినిపించడంలో నేను ఎప్పటికీ ఆపను అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.








కామెంట్లు (0)