న్యూఢిల్లీ : గాజాపై గతంలో భారత్ అనుసరించిన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం అనుసరించడం లేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ తాజాగా ప్రముఖ ఆంగ్ల దినప్రతిక ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’కి రాసిన వ్యాసంలో విమర్శించారు. గాజాలో శాంతిని నెలకొల్పేందుకు, మానవతా విలువల్ని రక్షించేందుకు మోడీ ఏమాత్రం నోరువిప్పడం లేదని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ సందర్భంగా తన తల్లి రాసిన వ్యాసంపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్కు దూరమవుతుండగా, భారత్ మాత్రం దాని వ్యూహాత్మక కక్ష్యలోకి జారిపోతోందని రాహుల్ వ్యాఖ్యానించారు. గాజాపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానంపైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని తిరిగి పొందాలని, మానవతా విలువలను నిలబెట్టాలని, గాజాపై నైతిక స్పష్టతతో మాట్లాడాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాలు ఇజ్రాయిల్కు దూరమవుతున్న తరుణంలో, భారతదేశం ఇజ్రాయిల్ 'వ్యూహాత్మక కక్ష్య'లోకి జారిపోతోంది అని రాహుల్ ఎక్స్ పోస్టులో మోడీ ప్రభుత్వంపై విమర్శించారు.
ఇజ్రాయిల్ గాజాలో ఊచకోత కోస్తుంటే... భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశాన్ని పర్యటించడం విస్మయం కలిగిస్తోందని రాహుల్ అన్నారు. పాలస్తీనా సోదర సోదరీమణుల పక్షాన మన గళం విప్పాలని భారత జాతీయతా స్ఫూర్తి కోరుతోంది. ఇప్పటికైనా మోడీ గాజాపై మాట్లాడాలి అని ఆయన డిమాండ్చేశారు.
సోనియాగాంధీ వ్యాసంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. పాలస్తీనా సోదర, సోదరీమణులు, వారి పిల్లలను క్రూరంగా లక్ష్యంగా చేసుకుని చంపేస్తున్నా.. మోడీ ప్రభుత్వం వారిపట్ల వహిస్తున్న మౌనాన్ని, నిష్క్రియాత్మకతను ఎత్తిచూపుతూ సోనియా గాంధీ రాసిన హృద్యమైన వ్యాసం, మన ప్రస్తుత విదేశాంగ విధానం.. పాలస్తీనా, ఇరాన్ విస్తృత మధ్యప్రాచ్యంలోని మన చారిత్రక మిత్రదేశాలను ఎలా దూరం చేసిందో స్పష్టంగా గుర్తుచేస్తుంది. మనం ప్రపంచ ప్రజాభిప్రాయానికి కూడా దూరమయ్యాం అని మల్లికార్జున ఖర్గే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.








కామెంట్లు (0)