గాలే : గాలే వేదికగా శ్రీలంక-ఎ తో జరుగుతున్న అనధికారిక టెస్టులో ఇండియా-ఎ జట్టు విజయంపై పట్టు బిగిస్తోంది. నాలుగో రోజు ఆటను ఓవర్నైట్ స్కోరు 48/0తో ప్రారంభించిన భారత జట్టు, 45 ఓవర్ల ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో ఆశించిన స్థాయిలో రాణించని దేవదత్ పడిక్కల్ ఈసారి 67 పరుగులతో అర్ధశతకం నమోదు చేశాడు.
ఓపెనర్ ఆయుష్ పాండే 38 పరుగులు చేసి దులజ్ సముదిత బౌలింగ్లో ఔటయ్యాడు. అంతకుముందే సాయి సుదర్శన్ కేవలం 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. తొలి ఇన్నింగ్స్లో వచ్చిన 172 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ప్రస్తుతం ఇండియా-ఎ మొత్తం 271 పరుగుల లీడ్లో ఉంది. టీ విరామానికి ముందు సాధ్యమైనంత ఎక్కువ స్కోరు చేసి, శ్రీలంక-ఏ ముందుంచే లక్ష్యాన్ని 400 పరుగులకు పైగా ఉంచాలనే ఆలోచనలో భారత జట్టు ఉంది.
ఇదిలా ఉంటే, శ్రీలంక-ఎ తొలి ఇన్నింగ్స్లో 330 పరుగులకు ఆలౌటైంది. నువానిదు ఫెర్నాండో (84), ఆషెన్ బండారా (70), కెప్టెన్ సహన్ అరాచిగె (72) అర్ధశతకాలతో జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో అకిబ్ నబీ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా, యష్ ఠాకూర్, హర్ష్ దూబే చెరో రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు ఇండియా-ఎ తొలి ఇన్నింగ్స్లో 452 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్, ఓపెనర్ సాయి సుదర్శన్ ఇద్దరూ అద్భుత శతకాలతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.









కామెంట్లు (0)