- లగేజీ ఆటోను ఢీకొన్న లారీ
- ముగ్గురు మహిళల దుర్మరణం
ప్రజాశక్తి - కవిటి (శ్రీకాకుళం జిల్లా) : ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం... మూడు నిండు ప్రాణాలను బలిగొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురంలోని సంత మార్కెట్ నుంచి ఒడిశా రాష్ట్రం బరంపురం మార్కెట్కు మినీ లగేజీ ఆటోలో పనసకాయల లోడుతో ముగ్గురు మహిళలు ఆదివారం బయల్దేరారు. ఈ క్రమంలో ఆటో శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం జమేదారిపుట్టుగ సమీపానికి వచ్చేసరికి పలాస నుంచి బరంపురం వెళ్తున్న లారీ వెనుకవైపు నుంచి ఢీకొట్టింది. దీంతో, మినీ లగేజీ ఆటో ఎగిరిపడి సమీపాన ఉన్న పొలంలో ఉన్న కరెంట్ స్తంభానికి బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇచ్ఛాపురం మండలం ఎ.ఎస్ పేటకు చెందిన మద్దిలి తరిణమ్మ (52), గుజ్జిపుట్టుగకు చెందిన మురపాల పార్వతి (50), రాపాకపుట్టుగకు చెందిన నర్తు పద్మమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్తో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఇచ్చాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో తీవ్రంగా గాయపడిన ఒకరిని మెరుగైన వైద్యం కోసం బరంపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.









కామెంట్లు (0)