- ఓ బాలుడు గల్లంతు
ప్రజాశక్తి - మొగల్తూరు (పశ్చిమగోదావరి జిల్లా), సీతానరగం (తూర్పుగోదావరి జిల్లా) : ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి చెందారు. ఒక బాలుడు గల్లంతయ్యాడు.ఈ ఘటనలు ఆదివారం చోటు చేసుకున్నాయి. సంఘటనలకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని తాళ్లమూడి గ్రామానికి చెందిన జిజ్జువరపు ఉమామహేశ్వరరావు (26) తన బాల్య మిత్రులతో కలిసి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్కు స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా ఉధృతంగా వచ్చిన అలల ధాటికి లోపలికి కొట్టుకుపోయాడు. కొద్దిసేపటికి కొంతదూరంలో ఆయన ఆచూకీ లభ్యమైంది. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఉమామహేశ్వరరావును హుటాహుటిన 108 అంబులెన్స్లో నరసాపురం ఏరియాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమళ్లకు చెందిన బాలుడు చుట్టుగుల్ల సుభాష్ తన ఏడుగురు మిత్రులతో కలిసి పేరుపాలెం బీచ్కు వెళ్లాడు. సముద్రంలో స్నానం చేస్తూ అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. బాలుని ఆచూకీ కోసం నరసాపురం రూరల్ సిఐ ఎం నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి రాజంపేట గ్రామానికి చెందిన పసుపులేటి దుర్గాప్రసాద్ (15) 10వ తరగతి, తొర్రేడు గ్రామానికి చెందిన అల్లూరి మహి (14) 9వ తరగతి చదువుతున్నారు. రాజంపేట గ్రామాల పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపులో ఆదివారం గోదావరి నదిలో స్నానానికి వెళ్లారు. నదిలో లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ నీట మునిగిపోయారు. గమనించిన స్థానికుడు కల్లా బన్ను పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు మృతి చెందారు. మృతదేహాలను పరిశీలించి, కేసు దర్యాప్తు చేపట్టారు.









కామెంట్లు (0)