- మళ్లీ వచ్చే అవకాశం ఉందని అధికారుల హెచ్చరిక
ప్రజాశక్తి -బుట్టాయగూడెం : పోలవరం, ఏలూరు జిల్లాల్లో గత పది రోజులుగా సంచరించిన పెద్దపులి ఎట్టకేలకు ఆదివారం తెల్లవారుజామున తెలంగాణ ఆటవీ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఈ పులి గత జనవరి 20వ తేదీన గుబ్బల మంగమ్మ గుడి అటవీ ప్రాంతం నుండి రాష్ట్రంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. తర్వాత దీన్ని పట్టుకుని పాపికొండలు అభయారణ్యంలో వదిలినప్పటికీ పది రోజుల క్రితం పోలవరం జిల్లాలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ నెల 21న గోదావరి నది దాటి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఆపై బుట్టాయగూడెం మండలంలో నాలుగు రోజులపాటు సంచరించి వేర్వేరు ప్రాంతాల్లో ఆవులపై దాడి చేసింది. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ తల్లి గుడి అటవీ ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రంలోని కావాడిగుండ్ల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి పెద్దపులి వెళ్లినట్లు దానికి ఉన్న ట్రాకర్ ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. మన రాష్ట్రం నుండి తెలంగాణ అడవీ ప్రాంతంలోకి ప్రవేశించిన పెద్దపులికి ఆహారం దొరకకపోతే మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం ఉందని, సమీప ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖాధికారులు హెచ్చరించారు.









కామెంట్లు (0)