రాజస్థాన్ : రాజస్థాన్లోని దౌసా జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వేపై లారీని బస్సు ఢీకొట్టి ఎనిమిదిమంది మరణించగా, మరో 22 మంది గాయపడ్డారు. ఈరోజు తెల్లవారుజామున హన్స్ ట్రావెల్స్కు చెందిన బస్సు ఉత్తరాఖండ్లోని రిషికేశ్ నుంచి మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వెళుతుండగా ... కోల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనవాడ సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై ముందుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండు వాహనాలకు మంటలు రాజుకున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని చికిత్స కోసం దౌసా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు సజీవ దహనం కాగా, తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు కాసేపటికే మరణించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది.
‘‘బుధవారం తెల్లవారుజామున 3:15 లేదా 3:30 గంటల సమయంలో జైపూర్-బండికుయ్ ఎక్స్ప్రెస్వేపై రిషికేశ్ నుంచి ఇండోర్కు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై అగ్నికి ఆహుతైంది. సుమారు 24 లేదా 25 మంది సురక్షితంగా ప్రాణాలతో బయపటపడ్డారు. వారు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు’’ అని దౌసా జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ సౌమ్య ఝా తెలిపారు. ''ఈ దశలో మేము కేవలం అంచనా సంఖ్యను మాత్రమే చెప్పగలము. మరణాలకు సంబంధించి తుది సంఖ్య ఇంకా నిర్ధారించబడలేదు. సుమారు ఏడు నుంచి ఎనిమిది మంది మరణించారు’’ అని ఆమె అన్నారు.









కామెంట్లు (0)