18వ రోజుకు పులిరామన్నగూడెం వాసుల ధర్నా
ప్రజాశక్తి - బుట్టాయగూడెం (ఏలూరు జిల్లా) : ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం ఉన్నత పాఠశాలలో ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు కొనసాగించాలని, గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పాఠశాల గేటు వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ధర్నా సోమవారం 18వ రోజుకు చేరుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వమే కావాలని ఆదివాసీ కొండ్రెడ్డి గిరిజన విద్యార్థులను డ్రాపవుట్ చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం.నాయక్ దృష్టికి ఇప్పటివరకు తీసుకెళ్లలేదని అన్నారు. ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంతంలో రేషనలైజేషన్ చేయాలనే నిబంధన చెల్లదని, విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చెబుతున్నప్పటికీ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని విమర్శించారు. సుమారు 300 మంది విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళన చేస్తుంటే కలెక్టర్ కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజన విద్యార్థులు కొండ కాల్వలు, అడవుల వెంట తిరుగుతుంటే కనీసం పట్టించుకోకుండా జిల్లా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకుంటే మిగతా గ్రామాల ప్రజలతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు.









కామెంట్లు (0)