కలిదిండి (ఏలూరు) : '' సమస్యలు పరిష్కరిస్తేనే జనాలు జై కొడతారు. లేకపోతే చూశాం కదా.. 11కి పరిమితం చేశారు `` అని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన 'మీ భూమి-మీ హక్కు` కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. అనంతరం సభా వేదికపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ .... ప్రధాని మోడి ఆధ్వర్యంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ సూపర్ స్పీడ్లో పరుగెడుతోందన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ అధికారులు గట్టిగా పనిచేయాల్సిందేనన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకంపై వేరే వాళ్ల ఫొటో వేసుకుంటే ఊరుకుంటామా.. ? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ విధ్వంసం వల్ల అనేక సమస్యలు వచ్చాయన్నారు. భూ సమస్యలపైనే ఎక్కువ ఆర్జీలు వచ్చాయనీ, ఎట్టి పరిస్థితుల్లో భూ సమస్యలను పరిష్కరించాలని అనుకున్నామని చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తేనే జనాలు జై కొడతారు. లేకపోతే చూశాం కదా.. 11కి పరిమితం చేశారు అని గుర్తు చేసుకున్నారు. బటన్ నొక్కడం, పరదాల చాటున రావడం, సభలు పెట్టి చెట్లు నరికేయటం గత పాలకులు చేశారనీ.. కానీ తాము ప్రతీ నెలా ప్రజల సమస్యలను తెలుసుకోవాలనే ఈ సమావేశాల ద్వారా ప్రజల్ని కలుస్తున్నామని అన్నారు. కరెన్సీ నోట్లకు ఉండే పటిష్టమైన భద్రతా ఫీచర్లను పట్టాదారు పాస్ పుస్తకాలకు కూడా అమలు చేస్తున్నామన్నారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామన్నారు. క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతిక పరమైన భద్రతా ఫీచర్లను ఏర్పాటు చేశామన్నారు. 32.32 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను ఇప్పటి వరకూ రైతులకు, భూ యజమానులకు అందించామని తెలిపారు. 9365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68.64 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని చంద్రబాబు ప్రసంగించారు.
సమస్యలు పరిష్కరిస్తేనే జనాలు జై కొడతారు. లేకపోతే.. : సిఎం చంద్రబాబు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 10, 2026, 02:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)