సియోల్ : దక్షిణ కొరియా మాజీ న్యాయశాఖ మంత్రికి న్యాయస్థానం సోమవారం 25 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 2024లో మాజీ అధ్యక్షుడు యున్ సుక్ యోల్ విధించిన సైనికపాలన (మార్సల్ లా) ప్రకటనలో మంత్రి పార్క్ సంగ్ జేను సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టు దోషిగా తేల్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. సైనిక పాలన విధించిన కొన్నిగంటల్లోనే పార్క్ న్యాయమంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారని, ఒక వేళ అధికారులు ప్రభుత్వ వ్యతిరేక వ్యక్తులను అరెస్ట్ చేస్తే, జైళ్ల సామర్థ్యంపై పరిశీలించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. పార్క్కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి చట్టాన్ని తిరుగుబాటు సాధనంగా మార్చారని, చట్టబద్ధమైన పాలనకు సవాలు విసిరారని వారు వాదించారు. ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం చూపలేదని అన్నారు.
యూన్ విధించిన మార్షల్ లా ఆరుగంటలు మాత్రమే కొనసాగింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే చట్టసభ సభ్యులు అత్యవసర సమావేశంలో వాటిని తిరస్కరించారు. తిరుగుబాటుకు నేతృత్వం వహించిన యూన్ సుక్ యోల్ ను దోషిగా నిర్థారించిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ శిక్షను అప్పీల్ చేయడంతో ప్రస్తుతం ఆయన నిర్బంధంలో ఉన్నారు. తన మార్సల్ లా ఉత్తర్వులను సమర్థించుకోవడానికి జాతీయ సంక్షోభాన్ని సృష్టించేందుకు ఉత్తర కొరియాకు డ్రోన్ లను పంపిన ఆరోపణలపై ఈ నెల ప్రారంభంలో యూన్ కు 30ఏళ్ల జైలు శిక్ష విధించింది.









కామెంట్లు (0)