బెంగళూరు : బెంగళూరు : ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలు జరపని ఇన్యాక్టివ్ వాలెట్లపై ప్రతి మూడు నెలలకు రూ.100 చొప్పున నిర్వహణ ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై వినియోగదారులకు సందేశాలు పంపడం ప్రస్తుతం నెట్టింట తీవ్ర ఆందోళనకు దారితీసింది. యాప్ వాడినంత మాత్రాన వాలెట్ యాక్టివేట్లో ఉన్నట్లు కాదని స్పష్టం చేసిన సంస్థ.. అదనపు రుసుముల భారం పడకుండా ఉండేందుకు 15 రోజుల ముందే యూజర్లకు నోటిఫికేషన్ అలర్ట్ ఇస్తున్నామని తెలిపింది. ఈలోగా వాలెట్ను యాక్టివేట్ చేసుకోవచ్చని కంపెనీ నిబంధనలలో పేర్కొంది. అయితే దేశంలో అత్యధికులు యుపిఐ లేదా యుపిఐ లైట్ లావాదేవీలకే ప్రాధాన్యమిస్తూ వాలెట్ వాడకాన్ని తగ్గించిన తరుణంలో కేవలం వాడనంత మాత్రాన ఫీజులు వసూలు చేయడం సరికాదంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్పే నిర్ణయాన్ని తప్పుబడుతూ సామాజిక వేదికలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ)కు ట్యాగ్ చేస్తున్నారు. ఫోన్పే వాలెట్ అనేది ఫోన్పే యాప్లో ఉండే ఒక డిజిటల్ పర్స్ లాంటిది. కొంత డబ్బును ముందుగానే ఈ వాలెట్లో దాచుకుని అవసరమైనప్పుడు చాలా వేగంగా చెల్లింపులు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి యుపిఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
ఇన్యాక్టివ్ ఫోన్పే వాలెట్లపై ఛార్జీల వడ్డన
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 01:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)