జైపూర్ : రాజస్తాన్లోని జైపూర్లో కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి ఘటనలో అరెస్టయిన ఐదుగురు నిందితులకు మంగళవారం బెయిల్ లభించింది. బెయిల్పై విడుదలైన వెంటనే వారిని మద్దతుదారులు పూలమాలతో సత్కరించారు. ఈనెల 15న జైపూర్లోని షహీద్ స్మారక్ వద్ద సిజెపి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అభిజిత్ దీప్కేపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. రోహిత్ శర్మ, రాకేశ్ గుజ్జర్, అజయ్ వర్మ, కుల్దీప్ సింగ్ శేఖావత్, నికేత్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని (బిఎన్ఎస్ఎస్) సెక్షన్ 170 కింద అరెస్ట్ చేసినట్టు జైపూర్ దక్షిణ విభాగ డిసిపి రాజర్షి రాజ్ వెల్లడించారు. అనంతరం జైపూర్ సౌత్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారికి బెయిల్ను మంజూరు చేశారు. నిందితులు బెయిల్పై విడుదలైన తర్వాత సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్ అయ్యాయి. నిందితులకు పూల మాలలు వేస్తూ.. ‘జై శ్రీరామ్’, ‘హిందూ ఏక్తా జిందాబాద్’, ‘భారత్ మాతా కీ జై’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ వంటి నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. నిందితుల్లో ఒకరైన రాకేశ్ గుజ్జర్ మీడియాతో మాట్లాడుతూ.. తాను జాతీయవాదినని, గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో ప్రాథమిక శిక్షణ పొందినట్టు అంగీకరించాడు. సామాజిక మాధ్యమాల్లో రాకేశ్ గుజ్జర్ ఆర్ఎస్ఎస్ యూనిఫాంలో ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మరొక నిందితుడు కుల్దీప్ శేఖావత్.. ‘మేము జాతీయవాదులం’ అనే శీర్షికతో ఉన్న రీల్ను పోస్ట్ చేశాడు. ఆయన ఫేస్బుక్ ఖాతాలో బిజెపి, మోడీ, వాజ్పేయి, యోగి ఆదిత్యనాధ్లకు మద్దతుగా పోస్టులు ఉండటం గమనార్హం. నిందితులకు జరిగిన సత్కారాన్ని చూసిన కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. 2022లో బిల్కిస్ బానో కేసులో దోషులుగా తేలిన వ్యక్తులకు విడుదల అనంతరం జరిగిన సత్కారాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్య దేశానికి ఏ మాత్రమూ యోగ్యం కావని అంటున్నారు. హిందూత్వ శక్తుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కాక్రోచ్’ వ్యవస్థాపకుడిపై దాడి కేసులో.. నిందితులకు బెయిల్
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 02:17 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)