బెంగాజీ: లిబియా తూర్పు మధ్యధరా సముద్ర తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడిన ఘటనలో వారం రోజుల్లో ఒక బాలికతో సహా 15 మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ విషయాన్ని భద్రతా, నావికా వర్గాలు ధృవీకరించాయి. ఐరోపాకు చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 61 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో పది మందిని సురక్షితంగా రక్షించినట్లు నావికా వర్గాలను ఉటంకిస్తూ మీడియా నివేదించింది. ఈజిప్టు సరిహద్దుకు సమీపంలోని థోబ్రుక్ నగర పరిసర ప్రాంతాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. వాటిలో చాలా మృతదేహాలు తీవ్రంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా పలువురు గల్లంతైన నేపథ్యంలో మరిన్ని మృతదేహాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలో జరిగిన మరో పడవ ప్రమాదంలో వైద్య, సహాయక బృందాలు 13 మందిని సురక్షితంగా రక్షించాయి.
మధ్యధరా సముద్ర మార్గం ద్వారా ఐరోపాకు చేరుకునే ప్రయత్నాల్లో ఇటువంటి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటుండటంతో వలసదారుల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.









కామెంట్లు (0)