విజయన్ కుమార్తె వీణాకు ఇడి నోటీసులు
తిరువనంతపురం : కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (సిఎంఆర్ఎల్)కు సంబంధించిన కేసులో ఈ నెల 29న మరోసారి విచారణకు హాజరుకావాలని కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణాకు ఇడి కొత్తగా నోటీసులు జారీ చేసింది. పినరయి విజయన్పై కక్షసాధింపు చర్యల్లో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద నమోదు చేసిన ఈ కేసులో ఇప్పటికే ఈ నెల 17న కొచ్చిలోని ఇడి కార్యాలయంలో వీణాను అధికారులు విచారించారు. ఈ నెల19న తిరువనంతపురంలో వీణ బ్యాంకు లాకర్లను ఇడి అధికారులు తనిఖీ చేశారు. వీణాకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈ కంపెనీ ప్రస్తుతం ఉనికిలో లేదు) నుంచి ఎలాంటి సేవలు పొందకుండానే సిఎంఆర్ఎల్ మొత్తం రూ. 2.78 కోట్లు చెల్లించిందన్న ఆరోపణలకు సంబంధించిన ఈ కేసులో ఇడి విచారణ జరుపుతోంది. సిఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ శశిధరన్ కర్త నిర్వహణలోఉన్న ఎంపవర్ ఇండియా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈఐసీఐపీఎల్) ద్వారా ఎక్సాలాజిక్కు ఇచ్చిన రూ. 50 లక్షల రుణాలపై కూడా ఇడి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ ఫిర్యాదు ఆధారంగా ఇడి ఈ కేసు నమోదు చేయడం గమనార్హం. శశిధరన్ కర్తా కుమార్తె, సిఎంఆర్ఎల్ అనుబంధ సంస్థ డైరెక్టర్ శిబీ ఎస్. కర్తా, సిఎంఆర్ఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శరణ్ ఎస్. కర్తా, ఇఐసిఐపిఎల్ డైరెక్టర్, శశిధరన్ కర్తా భార్య అయిన జయ ఎస్. కర్తాలను కూడా ఇడి ఇప్పటికే ప్రశ్నించింది.









కామెంట్లు (0)