- ఐఎఎస్ అధికారి గంగ్వార్ నివాసాల్లో ఇడి సోదాలు
న్యూఢిల్లీ : కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కెపిఎస్సి) కుంభకోణం కేసులో నిందితుడైన ఐఎఎస్ అధికారి, ఎంఎస్ఎంఇ డైరెక్టర్ జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ నివాసాల్లో ఇడి సోదాలు నిర్వహించింది. బెంగళూరు, ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఉన్న ఆయన నివాసాలలో సోదాలు చేశామని ఇడి అధికారులు ఆదివారం తెలిపారు. గంగ్వార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, బెంగళూరుతో పాటు బరేలీలోనూ గంగ్వార్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు జరిపామని ఇడి అధికారులు తెలిపారు. కాగా, ఆదివారం సిఆర్పిఎఫ్ బృందం వెంటరాగా, ఇడి బృందం మూడు వాహనాల్లో బెంగళూరులోని గంగ్వార్ అపార్ట్మెంట్కు చేరుకుంది. వీరిని గంగ్వార్ భద్రతా సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు లోపలికి రాకుండా అడ్డుకోవడం గమనార్హం. అనంతరం వీరిని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోకి అనుమతించారు. తరువాత ఇడి బృందం సోదాలు నిర్వహించింది. కాగా, మరోవైపు గంగ్వార్ పరారీ కాలేదని, అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని పరామర్శించడానికి ఉత్తరప్రదేశ్కు వెళ్లారని కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. కెపిఎస్సిలో పరీక్షల కంట్రోలర్గా గంగ్వార్ పని చేసిన సమయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఇడి ఆరోపిస్తోంది. ముఖ్యంగా పశువైద్య అధికారి నియామక పరీక్ష జరిగినప్పుడు గంగ్వార్ అభ్యర్థుల నుంచి రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు డిమాండ్ చేశారని ఇడి ఆరోపిస్తుంది.








కామెంట్లు (0)