ఖర్గేని అవమానించిన వారిపై కేసు నమోదు చేయాలి
రాహుల్ గాంధీ డిమాండ్
న్యూఢిల్లీ : బిజెపి దళితులను అవమానిస్తుందని, వారు గౌరవంగా జివించడం కాషాయ పార్టీకి ఇష్టం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. శనివారం న్యూ ఢిల్లిలో మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను అవమానించిన వారిపై ఎస్సి,ఎస్టి చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధి డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని బిజెపి, ఆర్ఎస్ఎస్ ఉల్లంఘిస్తునాయన్నారు. ఉత్తరాఖండ్ హల్ద్వానీలో బిజెపి, సంఘ్ పరివార్ కార్యకర్తలు శుద్ధి కార్యక్రమం చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. ఈ చర్యను ‘నేరం’గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు న్యాయం చేయాలని, ఈ చర్యపై కేసు నమోదు చేయాల్సిందిగా ప్రధాని మోడీ అధికారులను ఆదేశించాలని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం అంటరానితనం నిషేధమని, అది నేరమన్నారు. అయినా బిజెపి, ఆర్ఎస్ఎస్లు దురాచారాన్ని పాటిస్తున్నాయన్నారు. అలాగే, ఆ ప్రదేశం కలుషితమైందంటూ ఉత్తరాఖండ్ బిజెపి అధ్యక్షుడు మహేంద్ర భట్ వ్యాఖ్యానించిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. రాజ్యసభ ప్రతిపక్షనేత పట్ల ఇటువంటి చర్యలకు పాల్పడితే.. ఇక పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి పట్ల ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవాలన్నారు. ఈ ఘటన దళితులపై బిజెపి, ఆర్ ఎస్ఎస్ మనస్తత్వాన్ని బయటపెడుతోందని, దళితులు గౌరవంగా, విజయంతో జీవించడం వారికి ఇష్టంలేదని విమర్శించారు. ఈ నెల8వ తేదీన హల్ద్వానిలోని రామ్లీలా మైదానంలో జరిగిన విజయ శంఖనాద్ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రసంగించారు. రెండు రోజుల తర్వాత, ఆ ప్రదేశం అపవిత్రమైందంటూ బిజెపి, సంఘ్ పరివార్ కార్యకర్తలు ఆ ప్రాంతంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.







కామెంట్లు (0)