న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేకు న్యాయం చేయాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ హల్ద్వానీలో చేపట్టిన ‘శుద్ధి’ కార్యక్రమం’పై ఎస్సి/ఎస్టి చట్టం కింద కేసు నమోదు చేయాలని అన్నారు. న్యూఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ చర్యను ‘నేరం’గా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు న్యాయం చేయాలని, ఈ చర్యపై కేసు నమోదు చేయాల్సిందిగా ప్రధాని మోడీ అధికారులను ఆదేశించాలని పేర్కొన్నారు. ఖర్గేకు న్యాయం జరిగేలా చూడటం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల భాద్యత అని అన్నారు. రాజ్యాంగంప్రకారం అంటరానితనం నిషేధమని, అది నేరంగా పరిగణించబడుతుందని అన్నారు. అయినా బిజెపి/ఆర్ఎస్ఎస్లు ఆ చర్యను పాటిస్తున్నాయని మండిపడ్డారు.
‘ఆ ప్రదేశం నినాదాలతో కలుషితమైంది’ అని ఉత్తరాఖండ్ బిజెపి అధ్యక్షుడు మహేంద్ర భట్ ఈ చర్యను సమర్థిస్తూ వ్యాఖ్యానించిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. రాజ్యసభ ప్రతిపక్షనేత పట్ల ఇటువంటి చర్యలకు పాల్పడితే.. ఇక పాఠశాలలో నాలుగేళ్ల చిన్నారి పట్ల ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవాలని అన్నారు. ఈ ఘటన బిజెపి-ఆర్ ఎస్ఎస్ మనస్తత్వాన్ని బయటపెడుతోందని, దళితులు గౌరవంగా,విజయంతో జీవించడం వారికి ఇష్టంలేదని దుయ్యబట్టారు. ఈ నెల8వ తేదీన హల్ద్వానిలోని రామ్లీలా మైదానంలో జరిగిన విజయ శంఖనాద్ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రసంగించారు. రెండు రోజుల తర్వాత, ఆ ప్రదేశం అపవిత్రమైందంటూ శ్రీరామ్ సేన సభ్యులు శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.








కామెంట్లు (0)