గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

టీమిండియాకు ఊరట.. సుందర్, నితీశ్‌ ఫిట్

1 గంట క్రితం

nitish and sunder.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 07:55 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు ఊరట లభించింది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి పూర్తి ఫిట్‌నెస్ సాధించారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్ లో పాసయ్యారు. గురువారం ఢిల్లీలో భారత జట్టుతో కలవనున్నారు.

గత జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా సుందర్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్ అనంతరం క్వాడ్రిసెప్స్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఇద్దరూ కోలుకోవడంతో భారత జట్టుకు ఊరట లభించింది. మరోవైపు మోకాలి గాయంతో బాధపడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా, ఇంకా కోలుకోని హర్షిత్ రాణా అందుబాటుపై స్పష్టత రావాల్సి ఉంది. వీరి స్థానంలో స్థానిక పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

ఈ నెల 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇబ్రహీం జద్రాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ జట్టుతో భారత్ ఆడనున్న తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఇదే. ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

చెన్నైలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ అనంతరం ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ, తిలక్ వర్మ జట్టుతో చేరనున్నారు. టీ20 సిరీస్ అనంతరం ఈ నెల 22న జపాన్‌తో భారత్ టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత భారత జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొననుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్