- ఆర్ టిసి జెఎసి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పేరుతో ఆర్ టిసిలో పదోన్నతులపై విధించిన ఫ్రీజింగ్ను వెంటనే ఎత్తివేసి, ఈనెలాఖరు వరకు పదోన్నతులు కల్పించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని ఎపిపిటిడి(ఆర్ టిసి) ఉద్యోగ సంఘాల జెఎసి ప్రభుత్వాన్ని కోరింది. పదోన్నతుల ఫ్రీజింగ్ కారణంగా సుమారు 3 వేల మంది ఉద్యోగులకు నష్టం జరుగుతోందని జెఎసి కన్వీనర్లు వై శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిఎడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ నెలాఖరు వరకు పదోన్నతులకు అవకాశం కల్పించేలా గడువు ఇస్తామని అంగీకరించారని పేర్కొన్నారు. ప్రస్తుతం జారీ చేసిన ఆదేశాల్లో మల్టీజోన్లో ఉన్న ఉద్యోగులు, కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించడంతో ఇతర కేటగిరీల ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.ఈ నెలలో సుమారు 500 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారని, పదోన్నతి పొందాల్సిన వారు ఆ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల జాప్యంతో ఉద్యోగుల సర్వీస్, ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలగకుండా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ నెల 14న జరిగిన ఉద్యోగ సంఘాల సమావేశంలో అంగీకరించిన మేరకు ఈ నెలాఖరు వరకు ఆర్ టిసిలో అన్ని అర్హత కలిగిన కేటగిరీలకు పదోన్నతులు కల్పించేందుకు ప్రత్యేక అనుమతి ఇస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పదవీ విరమణకు చేరుకున్న ఉద్యోగులకు ప్రస్తుతం జరిగే నష్టాన్ని తరువాత పూడ్చడం సాధ్యం కాదని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో అత్యవసరంగా స్పందించాలని కోరారు.








కామెంట్లు (0)