ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్, సిపి, కమిషనర్కు కోర్టు నోటీసులు
న్యాయ విచారణకు సాయికృష్ణ తల్లి పిటిషన్
సిఐ నాగరాజును కస్టడీకి కోరిన సిట్
ప్రజాశక్తి - విజయవాడ : సాయికృష్ణ కేసులో విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా ఉన్న ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం.ధాన్యచంద్రలకు విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సిట్ అధికారులు, సాయికృష్ణ తల్లి విజయవాడ కోర్టులో గురువారం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసును సిట్తో కాకుండా న్యాయ విచారణ జరిపించాలని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ వేశారు. విచారించిన కోర్టు కలెక్టర్, సిపి, విఎంసి కమిషనర్కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్, స్వర్గపురి ప్రాంతాల్లో సిసిటివి పుటేజీ మాయం కావడంపై విజయలక్ష్మి తరుపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో సిఐ నాగరాజు పాత్రపై దర్యాప్తు జరుగుతు న్నప్పటికీ, ఇతర అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉందని పేర్కొన్నారు. సిసిటివి పుటేజీ బ్యాకప్ను ప్రతి నెలా సేకరించాల్సి ఉందని, కానీ అలా చేయలేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఈనెల 29కి కోర్టు వాయిదా వేసింది.
కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్
సిఐ నాగరాజును తమ కస్టడీకి ఇవ్వాలని కోరూతూ సిట్ అధికారులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తునకు నాగరాజు సహకరించడం లేదని, సుమారు పది గంటలపాటు విచారించినా ఫలితం లేదని, చాలా ప్రశ్నలకు 'తెలియదు' అని సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే ఆయన సన్నిహితులు, స్టేషన్ సిబ్బంది, బంధువుల పాత్రపై అనుమానాలు ఉన్నందున విచారణ కొనసాగించాల్సి ఉన్నందున 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై కోర్టు విచారించింది. సమగ్రంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని నాగరాజు తరపు న్యాయవాది కోరారు. దీంతో విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. సిఐ కొట్టడం వల్ల సాయికృష్ణ లాకప్ డెత్ కు గురైనట్లు సిట్ నిర్ధారించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 17 మందిని సిట్ అధికారులు విచారించారు. కృష్ణలంక మహిళా ఎస్ఐ హిమజ స్టేట్మెంట్ను కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సిఐ నాగరాజు అరెస్టయి రాజమ హేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.








కామెంట్లు (0)