ప్రజాశక్తి - ఎన్టీఆర్ జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం అమరావతితో సమానంగా విజయవాడ కూడా అభివృద్ధి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. గవర్నర్పేట, శ్రీశ్రీ భవన్ లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో విజయవాడ బాగమని చెప్తున్నారు కానీ చేతల్లో మాత్రం లేదని అన్నారు. ప్రభుత్వం విజయవాడను పాత నగరం చూపించి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, అమరావతిలోని 29 గ్రామాలులో అభివృద్ధి పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. లక్ష కోట్లతో రాజధాని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అంటే అమరావతి 50శాతం, మిగిలిన 50శాతం సిఆర్డిఏ, విజయవాడకు కేటాయించాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఊంటే ఇప్పటివరకు రాజధానికి కేటాయించిన నిధులులో విజయవాడ అభివృద్ధికి ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలలో 8,603 చదరపు అడుగులు విస్తీర్ణంలో విస్తరించి ఉన్న సిఆర్డిఎ పరిధిలో 56మండలలు,1006 పంచాయతీలు సుమారు 75లక్షలు ప్రజలు ఉన్నారని తెలిపారు. ఒక్క అమరావతికే లక్షలు కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం, విజయవాడలో ఉపాధి, పరిశ్రమలు, వ్యాపార, మౌలిక సదుపాయాలు నిర్లక్ష్యం చేస్తుందన్నారు.
ఒకపక్క రాష్ట్రంలో కార్పొరేట్లకు రాయితీలుస్తున్న ప్రభుత్వం, విజయవాడ ఆటో నగర్లో మూసుకుపోతున్న చిన్న చిన్న పరిశ్రమలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. రియల్ ఎస్టేట్ పట్ల నిర్లక్ష్యం జరిగిందని, కొత్త ప్రభుత్వం వచ్చాక భవన నిర్మాణ రంగం ఊపందుకుంటుందని అనుకుంటే పూర్తిగా దివాలాతీసిందని అన్నారు. ఒకవైపు అమరావతి ముంపుకి గురవకుండా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, అభివృద్ధి చెందిన విజయవాడను ముంపుకు గురిచేసే బుడమేరును పట్టించుకోవడం లేదని అన్నారు. అమరావతి నిర్మాణం అంటే విజయవాడ నుండి కార్యాలయాలను తీసుకెళ్లడం కాదని, ఇక్కడ సంస్థలు ఇక్కడే ఉంచి, అక్కడ కొత్త వాటికి అవకాశం కల్పించాలని తెలిపారు. విజయవాడ పాత నగరంగా చూపించి ఇక్కడ ఉన్న అన్నిటిని ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడ్డారు. విజయవాడ అభివృద్ధికి కొత్త నిధులు కేటాయింపు తర్వాత, కనీసం మున్సిపల్ కార్పొరేషన్ బకాయిగా ఉన్న 1,000కోట్లు విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మావిగన్ గొప్పలు చెప్తున్న జగన్, తన ప్రభుత్వ హయంలో విజయవాడకి ఏమి చేసారో చెప్పాలని ప్రశ్నించారు. టిడిపి, వైసిపి రెండు విజయవాడను నిర్లక్ష్యం చేసి అక్కడ ప్రజలను మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం తీరు ఇలానే ఊంటే సిపిఎం ప్రజల సహకారంతో ఉద్యమం చేపడతుందని, అమరావతి అభివృద్ధికి పోరాటం చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ దోనేపూడి కాశీనాథ్, సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి భూపతి రమణ, పశ్చిమ నగర కార్యదర్శి సత్తిబాబు, తూర్పు నగర కార్యదర్శి పి.కృష్ణ పాల్గొన్నారు.








కామెంట్లు (0)