క్రీడలు : ప్రపంచ రోయింగ్ వేదికపై భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక 2026 వరల్డ్ రోయింగ్ కప్-IIIలో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. వరల్డ్ రోయింగ్ కప్ చరిత్రలో భారత్కు గోల్డ్ మెడల్ దక్కడం ఇదే తొలి సందర్భం కావడం విశేషం. లైట్వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్ ఫైనల్లో భారత ఆర్మీకి చెందిన ఉజ్వల్ కుమార్–లక్షయ్ జోడీ 6:26.09 నిమిషాల సమయంతో రేసును పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తొలి నుంచి చివరి వరకు అద్భుత సమన్వయం, వేగాన్ని ప్రదర్శించిన ఈ జంట ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఉజ్వల్ కుమార్, లక్షయ్ ఇద్దరూ భారత ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నారు. దేశంలో రోయింగ్ క్రీడ అభివృద్ధికి భారత సైన్యం గత కొన్నేళ్లుగా విస్తృతంగా ప్రోత్సాహం, నిధులు అందిస్తోంది. ఆ కృషికి ఈ స్వర్ణ పతకం మరో నిదర్శనంగా నిలిచింది. ఫైనల్లో భారత జోడీకి ప్రపంచ స్థాయి రోయర్ల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ముఖ్యంగా హాంకాంగ్, నెదర్లాండ్స్ జట్లు చివరి వరకు తీవ్రంగా పోటీపడ్డాయి. అయినప్పటికీ ఒత్తిడిని అధిగమిస్తూ చివరి క్షణం వరకు పట్టుదలగా పోరాడిన భారత జోడీ విజయం సాధించి దేశానికి చారిత్రక స్వర్ణాన్ని అందించింది.
రోయింగ్ వరల్డ్ కప్లో భారత్ గోల్డెన్ హిస్టరీ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 28, 2026, 05:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)