17 మంది క్రీడాకారులకు పురస్కారాలు
అరుమాయినాయగంకు జీవితకాల సాఫల్య అవార్డు
ముగ్గురికి ద్రోణాచార్య
జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటన
న్యూఢిల్లీ: జాతీయ క్రీడల మంత్రిత్వశాఖ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఇందులో 17 మంది క్రీడాకారులను ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపిక చేయగా.. ఒకరికి జీవితకాల సాఫల్య పురస్కారానికి, ముగ్గురు కోచ్లకు ద్రోణాచార్య అవార్డులకు మరో ఇద్దరికి ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరీ అవార్డులు అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ప్రపంచ కప్ విజేత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గాయత్రి గోపీచంద్, గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ రజత పతక విజేత బాక్సర్ నరేందర్ సహా 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులకు ఎంపిక చేసింది. అర్జున అవార్డు నామినేషన్ల జాబితాలో గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతీ, గాయత్రి గోపీచంద్ మహిళల డబుల్స్ భాగస్వామి త్రీసా జోలీ, డెకాథ్లెట్ మరియు హై జంపర్ తేజస్విన్ శంకర్, మరియు యువ బధిర రైఫిల్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అర్జున అవార్డుకు సెలెక్షన్ కమిటీ మొత్తం 24 మంది పేర్లను సిఫార్సు చేయగా.. 17 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది. 1962 ఆసియా క్రీడల గోల్డ్ మెడలిస్టు ఫుట్బాలర్ ఐ. అరుమాయినాయగంకు జీవితకాల సాఫల్య అర్జున అవార్డును ప్రకటించారు. ఇక కోచ్లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ఈసారి ముగ్గురు గెలుచుకున్నారు. అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్ చోటేలాల్ యాదవ్, షూటింగ్లో నేహ నందకుమార్ కు ద్రోణాచార్య అవార్డు దక్కింది. ద్రోణాచార్య లైఫ్ టైం కేటగిరీలో బాక్సింగ్ కోచ్ ధర్మేంద్ర సింగ్ యాదవ్, రెజ్లింగ్ విభాగంలో వీరేంద్ర కుమార్కు అవార్డులు వరించాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా, వివిధ విభాగాల్లో క్రీడాకారులు, కోచ్లు మరియు సంస్థలకు అవార్డులను ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జాతీయ క్రీడా మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఏడాది మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డుకు క్రీడా మంత్రిత్వ శాఖ ఏ క్రీడాకారుడినీ నామినేట్ చేయలేదు. పూణేలోని 'ఆర్మీ పారాలింపిక్ నోడ్'కు 2025 ఏడాదికి 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం' ప్రదానంకు ఎంపికైంది. క్రీడల ప్రోత్సాహం మరియు అభివృద్ధి రంగంలో విశేష కృషి చేసిన కార్పొరేట్ సంస్థలకు (ప్రభుత్వ లేదా ప్రైవేట్) మరియు స్వచ్ఛంద సంస్థలకు (ఎన్జిఓలకు) ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు.






కామెంట్లు (0)