ప్రజాశక్తి - గజపతినగరం : రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం గజపతినగరం కోర్టు ఆవరణంలో న్యాయవాదులు భారీ నిరసన చేపట్టారు. 'ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్' (ఐ ఏ ఎల్) విజయనగరం జిల్లా సెక్రటరీ రెడ్డి శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ... సమాజంలో చట్టాన్ని రక్షించే న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు పూర్తి స్థాయి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, రాబోయే ఉభయ సభల (అసెంబ్లీ, మండలి) సమావేశాల్లో న్యాయవాదుల రక్షణకు సంబంధించిన అవసరమైన బిల్లులను ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణ, కేరళ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ రక్షణ చట్టం విజయవంతంగా అమల్లో ఉందనే విషయాన్ని వారు గుర్తుచేశారు. అదే తరహాలో మన రాష్ట్రంలో కూడా ఏపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక బార్ అధ్యక్షులు లెంక రాంబాబు, కార్యదర్శి సాయి, సురేష్లతో పాటు ప్రముఖ న్యాయవాదులు ఉప్పలపాటి రమేష్, తొత్తడి దేవుడు, కే. రమనాజీ, రంభ శివహరనాధ్ రావు, చప్పా తిరుపతిరావు, గండి అప్పలనాయుడు, తొత్తడి దేవుడి బాబు తదితరులు పాల్గొని తమ మద్దతును తెలియజేశారు.
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి: ఐఏల్ జిల్లా కార్యదర్శి డిమాండ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 04:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)