భోపాల్ : మధ్యప్రదేశ్ భూకుంభకోణానికి సంబంధించిన ఆర్థిక అవకతవకలపై సిఎం వివరణనివ్వాలని, లేదా విచారణ పూర్తయ్యే వరకు ఆ పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భూకుంభకోణంపై బిజెపి నాయకత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించింది. గురువారం ఇక్కడ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ పాఠక్ మాట్లాడారు. మోహన్ యాదవ్ భూకుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా సిఎం సహా పలువురు బిజెపి నేతలు 10రోజుల పాటు మౌనం వహించారని అన్నారు. ఈ అంశం కేవలం భూకొనుగోళ్లకు సంబంధించినది మాత్రమే కాదని, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ముందుగా తెలుసుకోవడం వంటి వ్యక్తిగత లాభం కోసం వినియోగించుకున్నారా లేదా అనే అంశం గురించి అని అన్నారు. ఈ కొనుగోళ్ల సమయం, ప్రదేశం మధ్య తీవ్రమైన అవకతవకలు జరిగాయని అన్నారు. యాదవ్ మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ప్రాంతంలో ప్రకటించిన లేదా ముందుకు తీసుకెళ్లిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు, ఈ కొనుగోళ్లకు మధ్య సంబంధం ఉండవచ్చని ఆయన ఆరోపించారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ మరియు ప్రతిపక్ష నాయకుడు ఉమంగ్ సింఘార్తో సహా పార్టీ రాష్ట్ర విభాగం ఈ అంశాన్ని పదేపదే లేవనెత్తినప్పటికీ, బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని ఆయన పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తుందని, అవినీతి ఫిర్యాదుల కోసం ఒక ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభిస్తుందని ఆయన పేర్కొన్నారు. జూలై 15న భోపాల్లోని ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జూలై 20న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఈ అంశాన్ని లేవనెత్తుతుందని అన్నారు. భూ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
భూకుంభకోణంపై సిఎం మోహన్ యాదవ్ వివరణనివ్వాలి : కాంగ్రెస్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 06:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)