మంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని నాగురి ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఒక మహిళ, ఇద్దరు బాలికలు మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. కంకనాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగురిలో ఓ నివాస పెంకుటింటి పక్కన బుధవారం కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. దీంతో ఇంటిపై మట్టి, రాళ్లు పడటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఒక వ్యక్తిని, ఇద్దరు బాలికలను సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక మహిళ, ఇద్దరు బాలికలు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కొండచరియలు విరిగిపడటానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.









కామెంట్లు (0)