- తీర్పు ప్రకటించిన తెలంగాణ హైకోర్టు
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు పడింది. ఆయన విషయంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని పేర్కొంటూ సిజె జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ధర్మాసనం శుక్రవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. 2014లో జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం... ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్ధిగా పోటీ చేశారని, అయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు బిఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన స్పీకర్.... చట్టపరంగా దానం నాగేందర్ పార్టీ మారలేదంటూ మార్చి 11న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్కు పలు ఆధారాలు సమర్పించామని, వాటిని ఆయన పరిగణనలోకి తీసుకోలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. పిటిషన్లపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన సిజె ధర్మాసనం... కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాటి నుంచే దానం నాగేందర్పై అనర్హత వేటు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు స్పీకర్, ఎన్నికల కమిషన్కి సమాచారం ఇచ్చింది. కాగా, హైకోర్టు తీర్పుపై నాగేందర్ స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని, సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. ఎన్నికల్లో పోరాడటం తనకు కొత్త కాదని, పోరాటాలు చేసే ఈ స్థాయికి వచ్చా నని చెప్పారు. ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలో పోరాడి విజయం సాధిస్తానన్నారు.








కామెంట్లు (0)