సిఆర్డిఏ అథారిటీ ఆమోదం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని పరిధిలో కంతేరు, తాడికొండలో భూ సమీకరణకు సిఆర్డిఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపింది. ఆయా గ్రామాల్లో రైల్వేలైన్, ఇంటర్నర్ రింగురోడ్డు వేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. సిఆర్డిఏ 65వ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు. తాడికొండ, కంతేరులో మూడోవిడత భూ సమీకరణ చేయనున్నారని ప్రజాశక్తి ఇంతక ముందే ప్రచురించింది. తాజా సమావేశంలో ఆ నిర్ణయమే తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. భూ సమీకరణ చేసే ప్రాంతాల్లో 2026 జనవరి ఆరోతేదీ నాటికి తీసుకున్న రుణాల్లో రూ.1.50 లక్షలు మాఫీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాజధానిలోని శాఖమూరులో సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం భవనాలు కట్టేందుకు రూ.596 కోట్లతో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. 29 గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం గతంలో కేటాయించిన నిధులకు అదనంగా రూ.534 కోట్లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. గతంలో రూ.904 కోట్లు కేటాయించామని వివరించారు. రాజధాని గ్రామాల్లో మంచినీటి సరఫరా కోసం ప్రస్తుతం ఉన్న 29 గ్రామాల్లో సదుపాయాలు పెంచనున్నామని వివరించారు. ల్యాండ్ పూలింగ్ స్కీము కింద గతంలో చిన్న రోడ్లలో సిమెంటు కాంక్రీటు (సిసి) రోడ్లు వేయాలని అనుకున్నామని, సిఆర్ఆర్ఐ న్యూ ఢిల్లీ, ఐఐటి ఖరగ్ పూర్తి అధ్యయనం చేయించిన తరువాత అక్కడున్న మట్టి స్వభావం రీత్యా బిటి రోడ్లు వేయడం ఉత్తమమని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మంగళగిరి కార్పొరేషన్కు 30 ఎంఎల్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి పైపులైను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్లో దీన్ని 80 ఎంఎల్డీలకు పెంచనున్నామని అన్నారు. రాజధానిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్కు అనుమతి ఇచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. మిక్స్డ్ యూజ్ కింద భూములను అభివృద్ధి చేయడానికి పిచ్చుకలపాలెం7.9 ఎకరాలు, తుళ్లూరు ఐదు ఎకరాలు, మందడంలో 12.38, కురగల్లులో ఆరు ఎకరాలు మొత్తంగా రాజధానిలో 42 ఎకరాలు సిఆర్డిఏ గుర్తించిందని అక్కడ భవనాలు కట్టేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు. హోటళ్లకు స్టాండర్డ్ నిబంధనల ప్రకారం వాటి పక్కనే స్థలం ఉండి కావాలని అడిగితే 20 సెంట్ల నుండి 50 సెంట్ల వరకూ ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రసుత్తం నిబంధనల ప్రకారం రాజధానిలో ఎకరం రూ.4.10 కోట్లని పేర్కొన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టేందుకు 8.5 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదించినట్లు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ సదుపాయాల కల్పనకు సిఆర్ డిఏ అనుమతి ఇచ్చిందని, దీనికోసం ఐఓసిఎల్ ఎంఓయు చేసుకునేందుకు సిఆర్డీఏ అనుమతి ఇచ్చిందని తెలిపారు. దీని ద్వారా పవర్ సర్వీససెస్ సదుపాయాలూ కల్పించనున్నట్లు పేర్కొన్నారు.







కామెంట్లు (0)