- ‘ఇంటింటికి టిడిపి ’ పై నారా లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘ఇంటింటికి తెలుగుదేశం-2026’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి చేరుకోవాలని టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంపై ఆదివారం ఆయన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడో రోజు రాష్ట్రవ్యాప్తంగా 3,01,197 ఇళ్లను, ఇప్పటివరకు 17,61,197 ఇళ్లను కూటమి శ్రేణులు సందర్శించారని తెలిపారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ రాష్ర్టవ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొనడం, అన్ని జిల్లాల్లో ప్రజల నుంచి లభిస్తున్న సానుకూల స్పందన ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వం రెండేళ్లల్లో సాధించిన అభివృద్ధి, అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.








కామెంట్లు (0)