- 19న తుది జాబితా ప్రచురణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండో విడత మండల ప్రజా పరిషత్ (ఎంపిటిసి) జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పిటిసి) సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎంపిటిసి, జెడ్పిటిసి నియోజకవర్గాలకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాలను ఈ నెల 11న మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితాను ఈ నెల 14న సిద్ధం చేసి, 15న ప్రచురించనున్నారు. డ్రాఫ్ట్ జాబితాపై క్లెయిమ్లు, అభ్యంతరాలను 15, 16 తేదీల్లో స్వీకరించనున్నారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఈ నెల 16న సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాల జాబితాకు ఈ నెల 18న కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆమోదం తీసుకోనున్నారు. తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఈ నెల 19న ప్రచురించనున్నారు. పోలింగ్ కేంద్రాల డ్రాఫ్ట్ జాబితా తయారీ, ప్రచురణ, క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణతో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాల నిర్వహణ బాధ్యతలను ఎంపిడిఒలకు అప్పగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. తుది జాబితాను జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారులు కలెక్టర్ ఆమోదం పొందిన అనంతరం ప్రచురించాలని సూచించింది. చేపట్టిన చర్యలపై నివేదికను ఈ నెల 21లోగా పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.







కామెంట్లు (0)