- పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధికి జిటుజి ఒప్పందం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అమరావతిని వరల్డ్ క్లాస్ స్మార్ట్, లివబుల్ సిటీగా అభివృద్ధి చేయడంలో యుకె నైపుణ్యం, సాంకేతిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. దీనికోసం ఎపి మున్సిపల్శాఖ, యుకె ప్రభుత్వాల మధ్య పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధికి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎంఒయు చేసుకున్నారు. సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్, ఆధునిక టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీపై రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయనున్నాయి. మున్సిపాలిటీల్లో రూ.40 వేల కోట్ల మౌలిక వసతుల పనులకు ప్రపంచస్థాయి సాంకేతికతను వినియోగించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, యుకె ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్ అండ్ ట్రేడ్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్ డిప్యూటీ డైరెక్టర్ చాజ్ వాలియా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అమరావతితో పాటు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ఈ సహకారం ఉపయోగపడనుంది. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాథమిక మౌలిక వసతులను మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులను చేపడుతున్నామన్నారు. ఈ పనుల్లో యుకెకు చెందిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉత్తమ విధానాలను వినియోగించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాజెక్టుల ప్రణాళిక, ప్రాధాన్యత క్రమం, ఆర్థిక సాధ్యాసాధ్యాల అంచనా, పెట్టుబడులకు అనుకూలమైన బిజినెస్ రూపకల్పన, ప్రాజెక్ట్ డిజైన్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్, అమలు వంటి అంశాల్లో ఇరు ప్రభుత్వాలు కలిసి పనిచేయనున్నాయని తెలిపారు. రాష్ట్రంలో నగరాలను మెరుగైన అర్బన్ స్ట్రక్చర్తో స్మార్ట్, లివబుల్ సిటీలుగా తీర్చిదిద్దేందుకు యుకె నైపుణ్యాన్ని వినియోగించుకోనున్నుట్లు తెలిపారు.
పెట్టుబడుల సమీకరణకు అవకాశాలు
మౌలిక వసతుల ప్రాజెక్టులకు కొత్త ఆర్థిక నమూనాలు, పెట్టుబడుల సమీకరణ అవకాశాలను కూడా ఈ ఒప్పందం కల్పిస్తుందని అన్నారు. అర్హత కలిగిన ప్రాజెక్టులకు నిర్దేశిత ఆర్థిక అర్హతలు, డ్యూడిలిజెన్స్, యుకె కంటెంట్ తదితర నిబంధనలకు లోబడి యుకె ఎక్స్పోర్ట్ ఫైనాన్స్ ద్వారా ఆర్థిక సహాయం పొందే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేయడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఆర్డిఎ కమిషనర్ విజయ రామరాజు, అదనపు కమిషనర్ రాహుల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యుకె ప్రతినిధి బృందంలో దక్షిణాసియా ట్రేడ్ కౌన్సిలర్ మార్క్ బిర్రెల్, డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, నేషనల్ లీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిషికేష్ చందా, సౌత్ ఇండియా రీజినల్ హెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోహిత్ చంద్రగిరి, గవర్నమెంట్ పార్ట్నర్షిప్స్ డిప్యూటీ డైరెక్టర్ చాజ్ వాలియా పాల్గొన్నారు.








కామెంట్లు (0)