మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

15 నుంచి క్షేత్రస్థాయి అధ్యయన యాత్రలు

6 గంటల క్రితం

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 04:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

* ఆగస్టు 15న జాతీయ సమైక్యతా దినోత్సవం

* ప్రతి గుడిముందు జాతీయ జెండా ఎగరేద్దాం

* ‘సామాజిక శంఖారావం` సదస్సులో విఎస్ఆర్


ప్రజాశక్తి - తిరుపతి సిటి : దళితుల ఆత్మగౌరవం కోసం, కులవివక్ష లేని సమాజం కోసం 15 నుంచి చేపట్టనున్న క్షేత్రస్థాయి అధ్యయన యాత్రలను జయప్రదం చేయాలని దళిత సోషల్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు, జాతీయ నాయకులు కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి పిలుపునిచ్చారు. అధ్యయన యాత్రలు, ఆందోళనలు, ప్రత్యక్ష కార్యాచరణ రూపాల్లో సామాజిక శంఖారావాన్ని పూరించాలన్నారు. ఆగస్టు 15న జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రతి గుడి ముందు జాతీయ జెండా ఎగరవేయాలన్నారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో జిల్లా సామాజిక శంఖారావం సదస్సు మంగళవారం జరిగింది. కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేష్ అధ్యక్షత వహించారు. వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ సామాజిక శంఖారావం కార్యాచరణను వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ఆగస్టు 24 వరకూ మూడు దశల్లో కార్యక్రమం ఉంటుందన్నారు. మొదటి దశలో భాగంగా క్షేత్రస్థాయిలో కులవివక్ష రూపాలను అధ్యయనం చేయాలన్నారు. అనంతరం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కులవివక్షపై ఆందోళనలు ఉంటాయన్నారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆలయాల ముందు జాతీయ జెండాలను ఎగురవేసి, జాతీయ సమైక్యతను చాటాలన్నారు. వివక్షకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులను, యువతను ఎక్కువగా భాగస్వాములను చేయాలన్నారు. మతం మత్తులో రగిలిపోతున్న నరేంద్ర మోడీకి కౌంట్ డౌన్ ప్రారంభమయ్యిందన్నారు. ఏ అయోధ్య రామాలయం వారిని అధికారంలో కూర్చోబెట్టిందో, ఆ ఆలయమే వారిని కూలుస్తుందని, ఏ రాముడు పేరు చెప్పి మోడీ పెత్తనం చేస్తున్నాడో, అదే రాముని బాణానికి బలవక తప్పదని హెచ్చరించారు. సామాజిక వివక్షకు గురవుతున్న వారికి అన్ని ప్రజా సంఘాలు, లౌకిక, అభ్యుదయ వాదులు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు.


కుల వివక్షత పోరాట సమితి (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ కుల సమస్య అనేది ఒక భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఏ దేశంలో లేదన్నారు. ఉమ్మడి జిల్లాలో పచ్చికాపల్లం మహాభారతం సందర్భంగా తలెత్తిన వివక్షపై సిపిఎం, కెవిపిఎస్ సంయుక్తంగా పోరాడిన సందర్భంగా అధికార యంత్రాంగం దిగివచ్చి సమస్యను పరిష్కరించిందని గుర్తు చేశారు. పోరాటాల ఫలితంగానే ఎస్సీ, ఎస్టి సబ్ప్లాన్ చట్టం, జీవో నంబర్ 12345 సాధించామన్నారు. బూర్జువా మ్యానిఫెస్టోల్లో సామాజిక న్యాయం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందన్నారు. అభివృద్దిలోనూ వివక్ష కొనసాగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధుల్లో 25శాతం దళితవాడలకు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. తిరుమల కల్తీలడ్డుపై సనాతన ధర్మానికి ప్రతినిధినంటూ దునుమాడిన డిప్యూటీ సిఎం, కులవివక్షపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సాక్షాత్తు నరేంద్రమోడీ ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తనను ప్రధానిని చేస్తే సబ్ ప్లాన్ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకొస్తానని చెప్పి, 12 ఏళ్లయినా ఇంతవరకూ అమలు కాలేదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని చెప్పిన మోడీ, 12 ఏళ్లలో 24కోట్ల ఉద్యోగాలు చూపించాల్సి ఉండగా ఏం చేశారని ప్రశ్నించారు.


గొర్రెల మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర నాయకులు వెంకట్రావు మాట్లాడుతూ ఇప్పటికీ అద్దె ఇళ్ల కోసం వెతుకుతుంటే కుల ప్రస్తావన లేకుండా ఇళ్లు ఇవ్వడం లేదన్నారు. దళితులకు స్మశానాలు చూపకపోగా, ఉన్న వాటిని కబ్జా చేస్తున్నారని విమర్శించారు. యువత తిరగబడితేనే హక్కులు సాధించుకోగలమన్నారు.


వ్యకాసం జిల్లా ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో మూడు రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నా వివక్ష మాత్రం తగ్గలేదన్నారు. సంక్షేమ పథకాల అమలులోనూ వివక్ష చూపుతున్నారన్నారు.


ఈ కార్యక్రమంలో నాయకులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య, హేమలత, సాయిలక్ష్మి, టి.సుబ్రమణ్యం, జయచంద్ర, పవిత్ర, బాలకృష్ణ, చెంగయ్య, లక్ష్మయ్య, హరినాథ్, ఎన్ డి శ్రీను పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్