- ఆగ్రహించిన రైతులు
విజయవాడ - నూజివీడు : రహదారిపై రాస్తారోకో ప్రజాశక్తి - గన్నవరం పోలవరం కాలువ నీటితో సాగు చేస్తున్న రైతుల మోటార్ కనెక్షన్లను ప్రభుత్వం తొలగించడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి వద్ద విజయవాడ - నూజివీడు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వీరికి రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కాలువ అభివృద్ధి కోసం వేలాది ఎకరాల విలువైన భూములను త్యాగం చేస్తే, ప్రభుత్వం తమకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘రైతును బతికించండి.. వ్యవసాయం చేయనివ్వండి’, ‘నీళ్లు ఇవ్వండి పంటను కాపాడండి’ అంటూ రైతులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రహదారిపై భీష్మించారు. దీంతో అధికార యంత్రాంగం దిగివచ్చింది. రైతుల డిమాండ్లకు అంగీకరిస్తూ, తొలగించిన మోటార్ కనెక్షన్లను వెంటనే పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. గంటన్నరకుపైగా సాగిన రాస్తారోకోతో విజయవాడ - నూజివీడు రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నున్న నుండి ఇటు ఆగిరిపల్లి వరకూ ట్రాఫిక్ స్తంభించింది.








కామెంట్లు (0)