అమరావతి : ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో మళ్లీ ఉపరితల ఆవర్తనం తీవ్ర రూపం దాల్చుతోంది. ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో శనివారం సాయంత్రానికి ఒక అల్పపీడనం ఏర్పడనుందని…. ఇది సోమవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ అల్పపీడన వ్యవస్థ క్రమంగా తీవ్రమై మంగళవారం నాటికి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల సమీపానికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకునే సూచనలున్నాయి.
కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ...
ఈ తీవ్రవాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర సహా కోస్తాంధ్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే ముప్పు ఉనందున అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉన్నందున…. ఆయా ప్రాంతాల ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేసింది.
సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరిక ....
తీరం వెంట గంటకు తీవ్ర వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తమ పడవలతో తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని సముద్ర తీర ప్రాంత అధికారులను, వేటగాళ్లను ఆదేశించారు.
అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ....
ప్రజలకు ఏమైనా అత్యవసర సహాయం లేదా సమాచారం కావాల్సి వస్తే వెంటనే సంప్రదించడానికి ప్రభుత్వం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వేర్వేరు టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా ప్రమాదం లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రజలు 112, 1070 లేదా 1800 425 0101 నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.








కామెంట్లు (0)