ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రాజెక్ట్-17ఏ కింద ఆరో స్టెల్త్ ఫ్రిగేట్ 'మహేంద్రగిరి (ఎఫ్-38)' ని ఈ నెల 11న విశాఖపట్నంలో అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టనుంది. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరుతో నామకరణం చేసిన ఈ యుద్ధనౌక భారత నౌకాదళంలో ఆ పేరుతో సేవలందించే తొలి నౌకగా నిలవనుంది. భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో రూపకల్పన చేయగా, ముంబైలోని మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించింది. అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత, తక్కువ రాడార్ గుర్తింపు, అధిక స్థాయి ఆటోమేషన్, మెరుగైన రక్షణ వ్యవస్థలతో కూడిన ఈ ఫ్రిగేట్ కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ (సీడీఓడీజీ) ప్రొపల్షన్ వ్యవస్థతో పనిచేస్తుంది. దీని ద్వారా అధిక వేగంతో పాటు దీర్ఘకాల సముద్ర కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం లభిస్తుంది. 75 శాతానికి పైగా స్వదేశీ భాగాలతో నిర్మితమైన మహేంద్రగిరి, కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి ప్రతీకగా నిలుస్తోంది. దీని నిర్మాణంలో అనేక భారతీయ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) భాగస్వామ్యం కావడంతో దేశీయ రక్షణ తయారీ రంగానికి మరింత బలం చేకూరింది. ఉపరితల లక్ష్యాలు, వైమానిక లక్ష్యాలు, జలాంతర్గాములపై దాడులు చేసే క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్, యాంటీ సబ్మరైన్ యుద్ధ సామర్థ్యాలు, సమగ్ర కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ఈ నౌకను సన్నద్ధం చేశారు. సముద్ర భద్రత, మానవతా సహాయ చర్యలు, విపత్తు నిర్వహణ, శోధన-రక్షణ (ఎస్ఏఆర్) కార్యకలాపాలతో పాటు వివిధ వ్యూహాత్మక సముద్ర మిషన్లను నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంది. ప్రాజెక్ట్-17ఏలో మరో కీలక మైలురాయిగా మహేంద్రగిరి కమిషనింగ్ నిలవనుండగా, భారత నౌకాదళ పోరాట సామర్థ్యాన్ని మరింత పెంపొందించడంతో పాటు స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేయనుందని అధికారులు తెలిపారు.
జూలై 11న భారత నౌకాదళంలోకి 'మహేంద్రగిరి' స్టెల్త్ ఫ్రిగేట్
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 11:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)