అనగనగా అద్రిపురం అనే ఊరిలో ఒక చిన్న కుటుంబానికి చెందిన రైతు ఉన్నాడు. అతని పేరు సాయి. అది వర్షాకాలం మొదలైన రోజులు. రైతులందరూ వర్షం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దానితో పాటు సాయి కూడా వర్షం ఎప్పుడొస్తుందా, ఎప్పుడు సాగుచేయాలని ఎదురుచూస్తున్నాడు. మొత్తానికి అయితే ఆలస్యంగానే వర్షం కురిసింది. రైతులందరూ దున్నడం, విత్తనాలు వేయడం మొదలెట్టారు. సాయి కూడా తన భార్య, కొడుకుతో కలిసి విత్తనాలు నాటారు. కొన్ని రోజులకు విత్తనాలు మొలకెత్తాయి. సాయి ఇతర రైతులందరూ ఆనందపడ్డారు. ఆ తర్వాత నెల వరకూ వర్షాలే కురవలేదు. పంటలన్నీ ఎండిపోవడానికి దగ్గరపడ్డాయి. అందరూ బాధ పడుతున్నారు. కొన్ని రోజులు చూద్దామని వర్షం కోసం ఎదురుచూశారు. వర్షాలు కురవలేదు. రైతులందరూ ఆశను వదులుకున్నారు.
కానీ సాయి మాత్రం వెనకడుగు వేయలేదు. పొలానికి దగ్గర్లో ఉన్న బావిలో నీరు బిందెలతో మోసుకొచ్చి, ఒక్కొక్క మొక్కను తడిపాడు. అలా ప్రతిరోజూ మొత్తం నీళ్ళు పోసేవాడు. సాయికి తెలుసు పొలం మొత్తానికి బిందెతో నీళ్లు పోయటం అసాధ్యమని. కానీ శక్తినంతా కూడకట్టుకొని నీళ్లు తెచ్చేవాడు. అందరూ చూసి నవ్వేవాళ్లు. ఇలా ఎన్నిరోజులు నీళ్లు పోస్తావు? ఇంత పెద్ద పొలానికి ఆ నీళ్లు సరిపోతాయా? అని. కానీ సాయి మాత్రం మొత్తం పొలానికి కాకపోయినా తను తన కుటుంబానికి సరిపడ పంటనైన తను పండించుకోవాలని మనసులో అనుకున్నాడు. ఆపకుండా తన పని రోజూ చేశాడు. తన కుటుంబం కూడా సాయం చేసింది. నీళ్లు పోయడం, కలుపు తీయటం వంటివి చేశారు. మూడు నెలల తర్వాత పైరు పచ్చగా మారి.. గింజలు వచ్చాయి. సాయి కుటుంబానికి కావలసిన ధాన్యం దొరుకుతుంది. మిగతా రైతులందరూ తిండి సరిపోక అప్పు చేయవలసిన పరిస్థితి. అప్పుడు సాయిని చూసి నవ్విన వాళ్ళంతా.. మెచ్చకోసాగారు.
నీతి: ప్రయత్నం లోపం కన్నా.. ఎంతో కొంత ప్రయత్నించడం మిన్న..
టి. కళ్యాణ్ రామ్
10వ తరగతి, గురుకుల పాఠశాల,
దేవరకద్ర,మహబూబ్ నగర్.







కామెంట్లు (0)