- స్తంభానికి కట్టేసి చితకబాదిన జనం
- పోలీసుల జోక్యంతో యువకుడికి విముక్తి
ప్రజాశక్తి-మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దొంగతనం అనుమానంతో ఓ యువకుడిని స్తంభానికి కట్టేసి సామూహికంగా కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. సంతగేటు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని రక్షించి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, సంతగేటు వద్ద ఉన్న ఎస్కేఎం ట్రేడర్స్కు చెందిన ఉల్లి వ్యాపారి దుకాణంలో రూ.20 వేల నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మదనపల్లి మండలం వేంపల్లికి చెందిన నాగేంద్ర అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేసిన దుకాణ యజమాని, సిబ్బంది అతడిని పట్టుకుని సమీపంలోని విద్యుత్ స్తంభానికి కట్టేశారు. అనంతరం పలువురు కలిసి అతడిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు యువకుడిని వారి చెర నుంచి విడిపించి మదనపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దొంగతనం నిజంగా జరిగిందా? నాగేంద్రకు ఈ ఘటనతో సంబంధం ఉందా? అనే అంశాలపై విచారణ చేపట్టారు. అలాగే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యువకుడిని స్తంభానికి కట్టేసి దాడి చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.







కామెంట్లు (0)