బీజింగ్ : చైనాలోని పలు ప్రాంతాలను అతి తీవ్ర తుపాను 'నౌల్' అతలాకుతలం చేస్తోంది. తుపాను తీవ్రత దృష్ట్యా చైనా జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ చైనాలో బలమైన ఈదురుగాలులతో పాటు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అత్యధిక ప్రభావానికి గురైన గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో మూడు లక్షలకుపైగా మందిని అధికారులు ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాల కారణంగా విమాన, రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. శనివారం ఒక్కరోజే 410కు పైగా విమాన సర్వీసులు, 150 హైస్పీడ్ రైలు సర్వీసులను అధికారులు రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుపాను ప్రభావం పొరుగున ఉన్న హాంకాంగ్లోనూ తీవ్రంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తుపాను గంటకు సుమారు 145 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. గ్వాంగ్డాంగ్ తీరాన్ని తాకేలోపు తుపాను మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని తెలిపింది. వరద ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. రాజధాని బీజింగ్తో పాటు పలు ప్రధాన నగరాల్లో బాధితుల కోసం 28 అత్యవసర పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే తుపాను ప్రభావంతో తూర్పు తైవాన్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Red Alert - చైనాను వణికిస్తున్న ‘నౌల్’ తుపాను
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 01:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)