శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తల లేఖలు
న్యూఢిల్లీ : ఆరావళి పర్వతాలపై సుప్రీం కోర్టు నియమించిన ఉన్నత స్థాయి కమిటీపై శాస్ర్తవేత్తలు, పర్యావరణవేత్తలు, విధాన నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ కూర్పులో మార్పులు చేయాలని వారు కోరుతున్నారు. కమిటీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు వారు గురు, శుక్రవారాల్లో లేఖలు రాశారు. ఆరావళి పర్వత శ్రేణి నిర్వచనం, సరిహద్దుల నిర్ధారణపై కేంద్రం ఇచ్చిన నివేదికను ఈ కమిటీ సమీక్షించాల్సి వుంది. మే 25న సుప్రీం కోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు భారతీయ అటవీ పరిశోధనా, విద్యా మండలి (ఐసిఎఫ్ఆర్ఇ) డైరెక్టర్ జనరల్ కంచన్ దేవీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆగస్టు 31కల్లా నివేదికను ఇవ్వాల్సిందిగా కమినీని ఆదేశించారు. ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుభాష్ అశుతోష్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర కుమార్ శర్మ, పర్యావరణ శాఖ మాజీ సంయుక్త కార్యదర్శి బ్రిజ్ మోహన్ సింగ్ రాథోడ్, ఢిల్లీ వర్శిటీ బోటనీ విభాగ మాజీ అధిపతి ప్రొఫెసర్ అశోక్ కె.భట్నాగర్ వున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్కి చెందిన ప్రొఫెసర్ జగదీష్ కృష్ణస్వామి, హర్యానా సెంట్రల్ వర్శిటీకి చెందిన ప్రొఫెసర్ లక్ష్మికాంత్ శర్మలను కోర్టు నియమించింది. కమిటీ పని విషయమై అవసరమనుకుంటే ఛైర్పర్సన్ వీరితో భేటీ కావచ్చు. మెంబర్ సెక్రటరీగా డైరెక్టర్ ర్యాంక్ అధికారి నామినేట్ చేయాల్సిందిగా పర్యావరణ శాఖను కోర్టు ఆదేశించింది.
దాదాపుగా కమిటీ సభ్యులందరూ పనిచేస్తున్న లేదా రిటైరైన ప్రభుత్వ అధికారులేనని ఒక లేఖలో పర్యావరణ వేత్త, సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ రవి చోప్రా పేర్కొన్నారు. వివాదాస్పద అంశాలపై స్వతంత్రంగా అభిప్రాయాలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు కమిటీకి గల సామర్ధ్యంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు.
పంజాబ్కు చెందిన మరో పర్యావరణవేత్త సమితా కౌర్ ఆరోగ్య అంశాలు, వృత్తిపరమైన అంశాలు, సాంప్రదాయ జీవనోపాధులు, పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ, నీటి వనరులు అంశాల్లో నిపుణులైన వారిని కమిటీలో సభ్యులుగా నియమించాలని సూచించారు. ఆరావళి పరిరక్షణ, సంరక్షణకు సంబంధించిన అంశమైనందున ఆయా అంశాలకు సంబంధించిన నిపుణులతో కమిటీ ఏర్పడాలని పర్యావరణ, విధాన నిపుణుడు సాగర్ ధర్ మరొక లేఖలో సూచించారు.









కామెంట్లు (0)