- రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభ కరపత్రాల ఆవిష్కరణలో ఎమ్మెల్సీ గోపిమూర్తి
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాల కారణంగానే దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు బొర్రా గోపిమూర్తి అన్నారు. దేశానికి తిండి గింజలు అందిస్తున్న అన్నదాతల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. రైతన్నలపై భారం మోపుతూ ఇటీవల పెంచిన ఎరువుల ధరలు, ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని అల్లూరు సత్యనారాయణ భవనంలో శనివారం నాడు ‘హలో రైతన్న- చలో ఏలూరు’, రైతు బహిరంగ సభ, ర్యాలీ కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ అన్నదాతల సమ్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. జులై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభను జయప్రదం చేయాలని కోరారు. రైతు రక్షణ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న రైతుల ర్యాలీ, బహిరంగ సభ కార్యక్రమాల్లో రైతాంగం, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్.లింగరాజు, డి.ఎన్.వి.డి ప్రసాద్, శ్రామిక మహిళా నాయకురాళ్లు విమల, రాజకుమారి, చల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)