వేలాన్ని బహిష్కరించి, వేలం కేంద్రం షెట్టర్ మూసేసి నిరసన
ప్రజాశక్తి- పొదిలి (మార్కాపురం) : పొగాకుకు కనిష్ట ధర క్వింటాలుకు రూ.16 వేలకు మించకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 వేలకు తగ్గకుండా ఉంటేనే అమ్ముతామంటూ పొదిలిలోని పొగాకు వేలం కేంద్రం షెట్టర్ ను మూసివేశారు. ఆ కేంద్రం బయట నిరసన తెలిపారు. మర్రిపూడి మండలం వేమవరం, పన్నూరు క్లస్టర్ల రైతులు శనివారం తమ పొగాకు బేళ్లను పొదిలి వేలం కేంద్రానికి తీసుకొచ్చారు. ప్రారంభం నుంచే కనిష్ట ధర క్వింటాలు రూ.16 వేలకు మించకపోవడంతో ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. వేలం కేంద్రం షెట్టర్ ను మూసేసి బయట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమవుతున్న వ్యాపారులు తీరును తీవ్రంగా నిరసించారు. కనిష్ట ధర రూ.20 వేలకు తక్కువ లేకుండా ఉంటేనే పొగాకు బేళ్లు అమ్ముతామని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొగాకును రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెప్పినప్పటికీ వ్యాపారులు పట్టించుకోవడం లేదన్నారు. కనిష్ట ధర 20 వేలకు కొనుగోలు చేయాలని, గరిష్ట ధర 28 వేల వరకు ఇవ్వకపోతే నష్టపోతామని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని గిట్టుబాటు ధరకు పొగాకును కొనాలని కోరారు.







కామెంట్లు (0)