- ధర్మస్థల యాత్రకు వెళ్తుండగా ట్రక్కును ఢీకొన్న ఎంయూవీ
- ముగ్గురి పరిస్థితి విషమం
యల్లాపూర్ (కర్ణాటక): ఉత్తర కన్నడ జిల్లా యల్లాపూర్ తాలూకాలోని అరబైల్ ఘాట్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధార్వాడ్కు చెందిన ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మస్థలతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలకు యాత్రకు వెళ్తున్న ఎంయూవీ వాహనం ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతులను సంజయ్ అంగడి (33), బసవరాజ్ (48),అభిషేక్ ఈశ్వర్ (28), అక్షయ్ (26), అభిషేక్ (26), మంజునాథ్ చులాకి (32)గా గుర్తించారు.వీరంతా ధార్వాడ్కు చెందినవారని పోలీసులు తెలిపారు.ప్రమాదంలో గాయపడిన దుర్గప్ప మడివాల్,చన్నబసయ్య సంపగవ్,సచిన్లను సమీప ఆసుపత్రికి తరలించగా,వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న యల్లాపూర్ పోలీసులు,హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఢీకొట్టిన ధాటికి ఎంయూవీ పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీయడానికి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.








కామెంట్లు (0)