న్యూఢిల్లీ : దేశంలోని “కోచింగ్ రాజ్” వ్యవస్థకు ముగింపు పలకాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. న్యాయవాది నరేంద్ర కుమార్ గోస్వామి ఈ మేరకు రిట్ పిటిషన్ దాఖలయింది. ప్రభుత్వం పగటిపూట పాఠశాలలను నడుపుతూ, "రాత్రిపూట పిల్లలను కోచింగ్ ఫ్యాక్టరీలకు అప్పగించకూడదు" అని పిటిషన్లో తీవ్రంగా పేర్కొన్నారు. అలాగే సమాన విద్యావకాశాల ప్రాథమిక హక్కు యొక్క పవిత్రతను కాపాడాలని, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న “డమ్మీ స్కూల్” సంబంధాన్ని నిర్మూలించడానికి జాతీయ స్థాయిలో నిబంధనలను రూపొందించాలని కూడా పిటిషన్లో కోరారు.
‘దేశంలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ఒక క్రూరమైన రెండు అంచెల నిర్మాణాన్ని సృష్టించింది. ఇందులో ఒక భారతదేశం ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళుతుంది, ప్రత్యేకంగా రూపొందించిన మెటీరియల్, మాక్ టెస్టులు, విశ్లేషణలు, అధ్యాపకుల అందుబాటు, ఉత్తమైన పరీక్షా వ్యూహాన్ని కొనుగోలు చేస్తుంది. మరో భారతదేశం సాధారణ పాఠశాలలకు వెళుతుంది. ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ను అనుసరిస్తుంది, సరైన సన్నద్దత లేకుండా పరీక్షలలో పోటీ పడుతుంది. ఇది సమానత్వం కాదు. ఇది ప్రభుత్వం సృష్టించిన అసమానత’’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యకు సమాంతరంగా, నియంత్రణ లేకుండా, అధిక ఫీజులతో నడిచే ప్రైవేట్ కోచింగ్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. జెఇఇ, నీట్, క్లాట్, సియుఇటి, ఎస్ఎస్సి వంటి జాతీయ ప్రవేశ పరీక్షల పాఠ్యప్రణాళికను, పరీక్షా విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన పాఠశాల సిలబస్కు అనుగుణంగా మార్చాలని కోరారు. ఇక ‘డమ్మీ స్కూల్స్’ గురించి ప్రస్తావిస్తూ పిల్లలను పేరుకు సిబిఎస్ఇ లేదా స్టేట్ బోర్డ్ పాఠశాలల్లో నామమాత్రంగా చేర్పిస్తారని, కానీ వీరు ఈ పాఠశాల విద్యకు హాజరు కాకుండా, గంటలపాటు కోచింగ్ సెంటర్లలో ఉంటారని తెలిపారు. ‘ఇది పాఠశాల విద్యను, విద్యార్థులను, ఆర్టికల్ 21ఎ (విద్యా హక్కు)ను మోసం చేయడమే. ఈ డమ్మీ పాఠశాలల ముఠా విద్యార్థులను రోజుకు 14–16 గంటల పాటు కోచింగ్ సెంటర్లకు పరిమితం చేస్తూ, వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై నేరుగా దాడి చేస్తోంది’ అని పిటిషన్దారుడు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు త్వరలో విచారించనుంది.








కామెంట్లు (0)