- అమెరికా సైనికుల మృతి
- మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం
టెహ్రాన్: అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఘర్షణలు మరింత ఉధృతమవుతూ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. అనంతరం ఉత్తర ఇరాక్లో కూలిపోయిన ఇరాన్ డ్రోన్ను నిర్వీర్యం చేసే క్రమంలో మరో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. జోర్డాన్ దాడి అనంతరం గల్లంతైన మరో సైనికుడి అవశేషాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలకు ప్రతీకారంగా అమెరికా ఆదివారం రాత్రి ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలపై భారీ వైమానిక దాడులు నిర్వహించింది. వరుసగా ఎనిమిదో రాత్రి ఇరాన్పై అమెరికా బాంబు దాడులు కొనసాగించింది. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ కూడా కువైట్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు చేసింది. క్యాంప్ ఉదైరిలోని ఆయుధాగారం, అలీ అల్ సలేం వైమానిక స్థావరంలోని పేట్రియాట్ రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు బహ్రెయిన్ సైన్యం ప్రకటించింది. జనావాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోందని ఆరోపించింది. జోర్డాన్లోని అకాబా ఓడరేవు నగరాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ క్షిపణిని ఇజ్రాయిల్–జోర్డాన్ సంయుక్త దళాలు కూల్చివేశాయి.
కువైట్లోని ఒక నీటి శుద్ధి, విద్యుత్ కేంద్రంపై వరుసగా రెండో రోజు కూడా దాడి జరగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇరాన్పై కొనసాగుతున్న సైనిక చర్యల్లో భాగంగా ఇజ్రాయిల్కు మరిన్ని అమెరికా ఇంధన సరఫరా విమానాలు చేరనున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇజ్రాయిల్ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనకపోయినా, అమెరికా సైనిక విమానాలకు ఆతిథ్యం ఇస్తోంది.
అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందున తాము కూడా ఆ ఒప్పందంలోని కట్టుబాట్ల నుంచి వైదొలుగుతున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందనే ఆందోళనలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి.








కామెంట్లు (0)