- ఐదుగురు సురక్షితం
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లారెడో నగర జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో ఆస్టిన్కు చెందిన ‘క్యాపిటల్ ఫ్యాక్టరీ’ స్టార్టప్ అధినేత జోషువా బేర్ అక్కడికక్కడే మరణించారు. విమానంలో ఉన్న మిగిలిన ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురు ప్రయాణికులతో మెక్సికో నుంచి టెక్సాస్లోని ఆస్టిన్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణంలో ఒక్కసారిగా సాంకేతిక లోపాలు తలెత్తడం, ఇంధనం అయిపోవడంతో విమానాన్ని అత్యవసరంగా లారెడో అంతర్జాతీయ విమానాశ్రయం వైపు మళ్లించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అయితే రన్వేకు కొద్ది దూరంలోనే విమానం నియంత్రణ కోల్పోయి, లూప్ 20 రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభాలను, ఒక వాహనాన్ని బలంగా ఢీకొట్టి రెండు ముక్కలైంది. కింద పడిపోగానే విమానంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
విమానం ఏ క్షణంలోనైనా పేలిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ, అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వారు చేసిన సాహసోపేత ప్రయత్నాల వల్లనే మిగిలిన ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడగలిగారు. సమయస్ఫూర్తితో స్పందించి మానవత్వాన్ని చాటుకున్న ఆ వాహనదారుల ధైర్యసాహసాలపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.









కామెంట్లు (0)